బేషరతుగా విధుల్లోకి తీసుకోండి..సమ్మె విరమిస్తాం : అశ్వత్థామరెడ్డి
![బేషరతుగా విధుల్లోకి తీసుకోండి..సమ్మె విరమిస్తాం : అశ్వత్థామరెడ్డి బేషరతుగా విధుల్లోకి తీసుకోండి..సమ్మె విరమిస్తాం : అశ్వత్థామరెడ్డి](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2019/11/TSRTC-1.jpg)
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుస్తుందా లేదా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇంతవరకూ సర్కారు నుంచి స్పందన లేదు..! ఆర్టీసీ జేఏసీ నేతల్ని ఇది కాస్త కలవరానికి గురి చేస్తోందనే చెప్పాలి. ఎలాంటి షరతులు లేకుంటే సమ్మె విరమణకు సిద్ధమని నిన్ననే జేఏసీ ప్రకటించింది. ప్రజలు, కార్మికుల వైపు నుంచి ఆలోచించే సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి చెప్పారు.
బేషరతుగా ఆహ్వానిస్తే అంతా డ్యూటీలో చేరతామన్నారు. అన్నిజిల్లాలు, డిపోల కార్మికుల అభిప్రాయాలు తీసుకున్నాక విరమణకు సిద్ధమయ్యామన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా, ఓ ప్రెస్నోట్ ఇచ్చి డ్యూటీలో చేరమని చెప్పినా తాము బస్సు ఎక్కేస్తామని JAC చెప్పినా.. ప్రభుత్వం మౌనంగానే ఉంది. లేబర్ కోర్టు తీర్పు కోసం వేచి చూడాలని సర్కారు భావిస్తోందా? లేదంటే గతంలో 2 సార్లు డెడ్లైన్ పెట్టినప్పుడు విధుల్లో చేరలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు తొందరపడాలని అనుకుంటోందా.! తాజా పరిణామాలు ఎటు మలుపులు తిరుగుతాయో అంతు చిక్కడం లేదు.
విధుల్లో చేరేందుకు సిద్ధమని ప్రకటించిన జేఏసీ నేతలు.. తాము డ్యూటీ చార్టులో తప్ప ఇంకెక్కడా సంతకాలు పెట్టబోమని ప్రకటించారు. అక్టోబర్ 4 నాటి పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐతే ఈ డిమాండ్పై ప్రభుత్వం ఒప్పుకుంటుందా..? సమ్మె కాలం నాటి జీతాల వ్యవహారం లేబర్ కోర్టు చూసుకుంటుందా..? కార్మికుల్లో ఇప్పుడిలా ఎన్నోప్రశ్నలున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించాలని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com