ఆర్టీసీ సమ్మెకు ఫుల్స్టాప్
52 రోజుల పాటు ఉధృతంగా సాగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు పుల్ స్టాప్ పడింది. పలు పార్టీలు, కార్మిక సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర్టీసీ జేఏసీ. మంగళవారం నుంచి విధులకు హాజరవ్వాలని జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రానప్పటికీ సమ్మె విరమిస్తున్నట్టు అధికారికంగా జేఏసీ ప్రకటించింది.
ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె విరమిస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. మంగళవారం నుంచి కార్మికులు అంతా విధులకు హాజరవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. మరోవైపు తాత్కాలిక ఉద్యోగులు విధుల్లోకి రావాదొద్దని సూచించారు. సమ్మె విరమించినంత మాత్రాన కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం నెగ్గినట్టు కాదని అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రస్తుతానికి సమ్మె విరమించినా.. కార్మికుల సమస్యలపై తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజి రెడ్డి ప్రకటించారు. రవాణ పరిరక్షణకు ప్రజలతో కమిటీ వేసి పోరాడుతామన్నారు రాజి రెడ్డి. ఆర్టీసీ సమ్మె అద్వితీయంగా కొనసాగిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అందరికీ అర్థమైందన్నారు. మానవత్వం లోపించి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కోదండారాం ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com