ఏపీ రాజ్భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి నేటితో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్, మంత్రులు.. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు.
రాజ్యాంగం ముందు అందరూ సమానమేనని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. హక్కులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చన్నారు. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థలు ప్రజలకు రక్షణ ఉంటాయన్నారు. పౌరులు తమ హక్కులను పరిరక్షించడం కాకుండా వారి బాధ్యతలను సైతం నిర్వర్తించాలని గవర్నర్ అన్నారు.
భారత రాజ్యాంగంలోని వ్యక్తి స్వేచ్చకు ప్రత్యేక గౌరవం ఇచ్చారని హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అన్నారు. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల కొరకు అనేది రాజ్యాంగంలో పొందిపరిచారని గుర్తు చేశారాయన. ప్రతి ఒక్కరికి రాజ్యాంగపరమైన హక్కులు, విధులు, బాధ్యతలు పొందిపర్చినట్లు జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి తెలిపారు.
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా అంటరానితనం రూపుమాపేందుకు కృషి చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్.. మేనిఫోస్టోలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారన్నారు. నవరత్నాల ద్వారా అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com