తెలంగాణ ఆర్టీసీపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం!

తెలంగాణ ఆర్టీసీపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తారా..? లేక ఫిఫ్టి ఫిఫ్టీ ఫార్ములాను అమలు చేస్తారా అన్నది గురు, శుక్రవారాల్లో జరిగే కేబినెట్ భేటీ తరువాత తేలిపోనుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై వరుస సమీక్షలు జరిపారు. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు.. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది...
సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉన్నా.. సమ్మె విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే విధుల్లో చేరాలని నిర్ణయించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు సూర్యపేట డిపో దగ్గరకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఉదయం నుండే కార్మికులను ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు మిన్నంటాయి. విధుల్లో చేరేందుకు వస్తున్న వారిని అరెస్ట్ చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ ఒకటో బస్ డిపో వద్ద కార్మికులు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలతో తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ జేఏసీ నిర్ణయం మేరకు ఉదయమే మెదక్ డిపో వద్దకు చేరుకున్న ఆర్టీసీ కార్మికులను అదుపులో తీసుకున్నారు పోలీసులు కరీంనగర్ జిల్లాలో కార్మికులు డిపోల దగ్గరకు వెళ్లగా వారిని అడ్డుకున్నారు పోలీసులు. తమకు ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో....విధుల్లోకి తీసుకోబోమన్నారు అధికారులు. రాజన్న సిరిసిల్లా జిల్లోలని వేములవాడ ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు. కనీసం వినతి పత్రం కూడా తీసుకోకపోవడంతో... ఆందోళనకు దిగారు కార్మికులు.
వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విధుల్లో చేరేందుకు కార్మికులు వనపర్తి ఆర్టీసీ డిపో వద్దకు చేరుకోగా.. వారని అడ్డుకున్నారు పోలీసులు. తమను విధుల్లో చేర్చుకోవాలంటూ డిపో మేనేజర్కు వినతి పత్రం ఇవ్వగా.. తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు డిపోమేనేజర్. నాగర్ కర్నూలు జిల్లాలో విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికుల్ని ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మెట్టుదిగి సమ్మె విరమిస్తే.. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి. బంగారు తెలంగాణ నినాదం పోయి.. అణగదొక్కే తెలంగాణ, అణచివేత తెలంగాణ అనే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ఉదయం నుంచే డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తమను విధుల్లో చేర్చుకోవాలంటూ.. వచ్చిన కార్మికుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్లు చేశారు. పాతబస్తీ ఫలక్నుమా, ఫారుఖ్ నగర్ ఆర్టీసీ డిపోల వద్ద వచ్చిన కార్మికుల్ని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com