విభేదాలు లేవు.. కామన్ మినిమం ప్రోగ్రామ్ పై క్లారిటీ ఉంది: మహావికాస్ అఘాడీ

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దమైంది. డిసెంబర్ 3లోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఆదేశించడంతో విశ్వాస పరీక్షకు రెడీ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు సాధించగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి. మహావికాస్ అఘాడీకి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్కు లేఖలు ఇచ్చారు. తమకు 170 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని మహావికాస్ అఘాడీ చెబుతోంది. దీంతో బలపరీక్షపై ధీమాగా ఉంది.
విశ్వాస పరీక్ష సందర్భంగా మహావికాస్ అఘాడీ నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. స్పీకర్ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణ అంశాలపైనా చర్చిస్తున్నారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా మంత్రివర్గంలో చేరనున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే పటోలేను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంది.
అటు మంత్రిపదవుల విషయంలో కూటిమి మధ్య విబేధాలు తలెత్తాయన్న వార్తలను ఆయా పార్టీల నేతలు ఖండించారు. పదవులు, కామన్ మినిమం ప్రోగ్రామ్ పై తమకు స్పష్టత ఉందన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని.. మీడియాలో వచ్చే కథనాలు నిజం కాదన్నారు. స్పీకర్ పదవి కాంగ్రెస్ నేతకు ఇవ్వనున్నట్టు తెలిపారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకునేది.. లేనిది.. పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com