సొంత నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటన


తెలంగాణ సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో బుధవారం పర్యటించనున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన పలు భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక.. గజ్వేల్ పై దృష్టిపెట్టిన కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే.. 19 కోట్ల 85 లక్షలతో మహతి ఆడిటోరియం, 19 కోట్ల 50 లక్షలతో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, 18 కోట్ల 50 లక్షలతో నిర్మించిన సమీకృత అధికార కార్యాలయ సముదాయాలను ప్రారంభిస్తారు.
TRS ప్రభుత్వం మొదటి దఫా అధికారంలోకి వచ్చినపుడు.. జిల్లా ఆసుపత్రి, కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ హబ్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నియోజకవర్గ ప్రజలకు సీఎం అందించారు. 12 వందల మంది సామర్ధ్యం కలిగిన మహతి ఆడిటోరియాన్ని రవీంద్ర భారతిని తలదన్నేలా నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా భారీగా నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ మరో ప్రత్యేకత. ఇందులో స్టాల్స్ను ఇప్పటికే పలువురికి కేటాయించారు అధికారులు.
గజ్వేల్తోపాటు ములుగులో 75 కోట్ల రూపాయలతో నిర్మించిన అటవీ కళాశాలను కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి హరీష్ రావు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హరీష్రావు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

