మహా మెట్రో సంస్ధ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం

మహా మెట్రో సంస్ధ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం

ktr

హైదరాబాద్‌లో సమగ్ర ప్రజారవాణా బలోపేతం దిశంగా ఒక నివేదికను సిద్దం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రో, రోడ్డు మార్గాల కోసం డబుల్ డెక్కర్ ఫైఓవర్లు నిర్మించే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీంతో భూసేకరణ ఖర్చు తగ్గుతుందని.. భవిష్యత్తులో మెట్రో రైలు మార్గాల ఏర్పాటు సులభం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. మహా మెట్రో అధికారులతో కేటీఆర్ కీలక అంశాలపై చర్చించారు.

మహారాష్ట్రలోని పలు నగరాల్లో మెట్రో రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్న మహా మెట్రో సంస్ధ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాసిక్, పూణే, నాగపూర్ నగరాల్లోని మెట్రో లో వారు చేపట్టిన కార్యక్రమాలు, నిర్మాణం తాలుకు వివరాలతో మహా మెట్రో అధికారులు మంత్రి కేటీఆర్ కు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో వ్యవస్థకి భిన్నంగా, తక్కువ ఖర్చుతో మెట్రో నియో పేరుతో నాసిక్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు వివరాలను మంత్రికి అందించారు. నూతన పద్దతితో ప్రాజెక్టు వ్యయం తగ్గడంతో పాటు స్వల్ప కాలంలోనే నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. సాంప్రదాయ మెట్రోలో రైల్వే కోచ్ లు ఉపయోగిస్తుండగా.. ఇక్కడ మెట్రోలో ఎలక్ట్రిక్ బస్సు కోచ్ లను ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఎలివేట్ కారిడార్ లతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్ల పైన కూడా ఈ మెట్రో నడుస్తుందన్నారు. ఇందులో 350 నుంచి 400 మంది ప్రయాణికులు ఒకే సారి ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం నాసిక్ లో తమ ప్రతిపాదనల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కోచ్ వచ్చేందుకు అవకాశం ఉందని.. దీన్ని రెండు నిమిషాలకు ఒకసారి కోచ్ లు వచ్చేలా చేసేందుకు కూడా వీలుందన్నారు. నాసిక్ మెట్రో ప్రతిపాదనలు, నిర్మాణానికి ఆర్థిక వివరాలను మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 25 శాతం నిధులు అందే అవకాశం ఉందని చెప్పారు.

మహా మెట్రో అధికారులు అందించిన ప్రజంటేషన్ పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నాసిక్ లా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన మెట్రో నియో ప్రతిపాదనలు అనుగుణంగా ఉంటాయని మంత్రి అన్నారు. హైదరాబాద్ కోసం ఆలోచిస్తున్న ఎలివేటేడ్ బీఆర్ టీఎస్ ప్రతిపాదనల రూపకల్పనలో మహ మెట్రో సంస్థ అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. దీంతోపాటు మహమెట్రో సంస్ధ పాటిస్తున్న 100 శాతం లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, రెయిన్ వాటర్ హర్వేస్టింగ్ పద్దతులు, మెట్రో స్టేషన్లపైన సోలార్ విద్యుత్ ఉత్పాదన, తక్కువ భూసేకరణ ఖర్చు వంటి అంశాలను ఈ ప్రతిపాదనల్లో పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.

పశ్చిమ హైదరాబాద్‌లోని జనాలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లోనూ ఏలివేటెట్, ఎలక్ర్టిక్ బీఆర్ టీఎస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇదే పద్దతిలో నాసిక్ లో ఏర్పాటు చేస్తున్న మెట్రో నియో మాడల్ ను అధ్యయనం చేయాలని మెట్రో రైల్ సంస్ధను కేటీఆర్ ఆదేశించారు. సమగ్ర ప్రతిపాదనలతో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని కోరారు. నగరంలో ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్, భవిష్యత్తులో రానున్న మెట్రో రెండో దశ మార్గాలు, ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లను, అవుటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను కలిపేందుకు ఉన్న అవకాశాలను, మార్గాలను అధ్యయనం చేయాలని అన్నారు.

Tags

Next Story