దిశ నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో మరో పిటిషన్

దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా సుప్రీం కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు దిశ ఘటనలో సేకరించిన సమాచారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుప్రీంకు సమర్పించనుంది. దిశ హత్య,నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ నాలుగో రోజుకూడా కొనసాగింది.
దిశపై అత్యాచారం జరిగినప్పటి నుంచి....నిందితుల ఎన్కౌంటర్ వరకు జరిగిన పరిణామాలన్నింటినీ జాతీయ మానవ హక్కుల సంఘం విశ్లేషిస్తోంది . శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన NHRC టీమ్ నాలుగు రోజులుగా అన్ని కోణాల్లోనూ విచారణ జరపుతోంది. తెలంగాణ పోలీస్ అకాడమీలోని I.O.M క్లాంప్లెక్స్ను NHRC సభ్యులకు కేటాయించారు. దిశ ఘటనపై NHRCకి రిపోర్టు అందించారు పోలీసులు. దిశను ట్రాప్ చేయడం, అత్యాచారం,డెడ్బాడీని కాల్చివేయడం వంటి అన్ని అంశాలనూ సమగ్రంగా పొందుపరిచారు. ఫోరెన్సిక్ డీటైల్స్..అన్ని శాస్త్రీయ ఆధారాలతోపాటు రక్తపు మరకల DNA రిపోర్టు, ఘటనాస్థలిలో లారీ తిరిగిన సీసీ పుటేజ్, నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన దృశ్యాలను NHRC బృందానికి అందజేశారు.
దిశపై అత్యాచారం కేసు నమోదు చేసినప్పటి నుంచి నిందితుల ఎన్కౌంటర్ వరకు దర్యాప్తులో పాల్గొన్న అధికారులను NHRC విచారించింది. ఎన్కౌంటర్ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు తగిలిన గాయాలపైనా వైద్యులను ఆరా తీశారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు వివరించారు. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో అటాక్ చేసి రివాల్వర్లు లాక్కున్నారని చెప్పారు. కొంతదూరం వెళ్లాక నిందితులు కాల్పులకు తెగబడ్డారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని వెల్లడించారు. ఈ విచారణకు షాద్నగర్, శంషాబాద్ పోలీసులు హాజరయ్యారు. ఎన్కౌంటర్పై రాచకొండ సీపీ మహేష్భగవత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ టీమ్ కూడా విచారణ మొదలు పెట్టింది..
ఎన్కౌంటర్పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నలుగురు నిందితులను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని... పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ పిటిషన్ వేశారు. మృతదేహాలను వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. ఈ ఘటనపై నమోదైన అన్నిపిటిషన్లను గురువారం విచారిస్తామని తెలిపింది న్యాయస్థానం. అటు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని కోరుతూ ఎమ్మెల్సీ రాములు నాయక్, మందకృష్ణ మాదిగ..డీజీపీ మహేందర్రెడ్డిని కలిశారు.
అటు దిశ కుటుంబ సభ్యులకు భారీ భద్రత కల్పించారు పోలీసులు.. ఒక ASIతోపాటు ఆరుగురు స్పెషల్ పోలీసులతో ప్రత్యేక పికెట్ను ఏర్పాటు చేశారు...అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపడంలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com