3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు : అమరావతి వాసులు

3 రాజధానుల ఫార్ములపై అమరావతి వాసులు భగ్గుమంటున్నారు. మందడం వై జంక్షన్ వద్ద రాజధాని రైతులు ధర్నాకు దిగారు. సచివాలయానికి వెళ్లే రోడ్డుపై బైఠాయించారు. GN రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారికి అడ్డంగా జేసీబీ పెట్టి... ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సచివాలయం నుంచి జీఎన్ రావు కమిటీని వేరొక మార్గంలోంచి పంపించారు..
GN రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తీవ్ర ఆన్యాయం చేశారని మండిపడ్డారు. అమరావతిలో వరద ముంపు వస్తుందంటున్నారని.. మరి విశాఖకు తుఫాను ముప్పు ఉండదా అంటూ నిలదీశారు..
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి.. తుళ్లూరులో రహదారులను దిగ్బంధించారు.. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. రైతుల ఆందోళనలతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.
వెలగపూడిలో రాజధాని రైతులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తమ త్యాగాలను అవమానించొద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే ఆందోళనలలో ఉన్న తమకు కమిటీ నివేదిక ఆజ్యం పోసినట్లు అయిందని రాజధాని రైతులు వాపోతున్నారు.
తుళ్లూరులో పెద్ద ఎత్తున వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు... మహిళలు, చిన్నారులు, విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు..
రాజధాని ప్రాంతంలో జనసేన నాయకులు పర్యటించారు. రైతులు, గ్రామస్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా మరికొందరు స్థానికులతో మాట్లాడారు. అమరావతినే రాజధానిగా ఉంచాలన్న డిమాండ్కు జనసేన మద్దతు ప్రకటించింది.
రాజధాని ప్రాంతంలో నిరసనకు దిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు . రైతులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుంటున్నారు. బాడీవోర్న్ కెమెరాలతో ఆందోళనలను చిత్రీకరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com