మూడు రాజధానులొద్దు.. అమరావతే ముద్దు నినాదానికి పెరుగుతున్న మద్దతు


అమరావతిని రాజధానిగా ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వరుసగా మూడో రోజు రోడ్లపైకి వచ్చారు. 3 రాజధానుల ఫార్ములకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి.
వెలగపూడిలో రాజధాని రైతులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తమ త్యాగాలను అవమానించొద్దంటూ నినాదాలు చేశారు. తుళ్లూరులో పెద్ద ఎత్తున వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు.
అటు.. రాజధాని ప్రాంతంలో జనసేన నాయకులు పర్యటించారు. రైతులు, గ్రామస్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా మరికొందరు స్థానికులతో మాట్లాడారు. అమరావతినే రాజధానిగా ఉంచాలన్న డిమాండ్కు జనసేన మద్దతు ప్రకటించింది.
మరోవైపు.. రాజధాని ప్రాంతంలో నిరసనకు దిగిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రైతులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుంటున్నారు. బాడీవోర్న్ కెమెరాలతో ఆందోళనలను చిత్రీకరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

