మేము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం : ప్రధాని మోదీ

భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి బలమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఢిల్లీలోని కొన్ని పార్టీలు తప్పుడు హామీలు ఇస్తూ, ప్రజలను మోసగిస్తున్నాయని, తాము మాత్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రామ్లీలా మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు మోదీ .
ఆమ్ ఆద్మీ సర్కార్పై మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. వారికి బంగళాలు ఉంటే.., తమ వెనుక సామాన్య ప్రజానీకం ఉందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఆప్ తప్పుడు వీడియోలు సర్క్యులేట్ చేస్తోందన్నారు. పార్లమెంటును గౌరవించాలని, ఉభయసభలూ బిల్లుపై ఆమోదముద్ర వేశాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడాలను మోదీ తీవ్రంగా ఖండించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com