29 గ్రామాల రైతులు వారం రోజులుగా రోడ్లపైనే..
నిరసనలు.. నినాదాలతో అమరావతి హోరెత్తుతోంది. ఏడో రోజు రైతుల ఆందోళనలు మరింత ఉధృతం రూపం దాల్చాయి.. గత టీడీపీ ప్రభుత్వం రాజధానిగా ప్రకటించిన ప్రాంతం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. 29 గ్రామాల రైతులు వారం రోజులుగా రోడ్లపైనే ఆందోళనలు చేపడుతున్నారు. రైతులకు విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు అంతా సంఘీభావం తెలుపుతూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రోజు రోజుకూ ఈ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. నిరసనల్లో భాగంగానే తుళ్లూరులో ఇవాళ ఉదయాన్నే ధర్నాకు టెంట్ వేస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. తమ ధర్నాపై పోలీసులు ఆంక్షలు పెట్టడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉదయం నుంచే తుళ్లూరులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
జీఎన్ రావు కమిటీ నివేదికపై అమరావతి ప్రాంత రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఉద్యమ కార్యచరణలో భాగంగా ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యతో రైతుల భేటీ కానున్నారు. రాజధాని అమరావతినే కొనసాగించాలని కోరనున్నారు. అటు గవర్నర్తో సమావేశమై రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరనున్నారు. గుంటూరు కాకమానులోనూ రైతులు మహాధర్నా నిర్వహించనున్నారు. ఇవాళ కృష్ణాయపాలెంలో రైతులు రిలే నిరాహరదీక్ష చేయనున్నారు. వెలగపూడి, తుళ్లూరు, మందడంలో ధర్నా చేపట్టనున్నారు. చలో హైకోర్టు పేరుతో న్యాయవాదులూ ఆందోళనలు ఇంకాస్త ఉధృతం చేయాలని నిర్ణయించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com