ఆకాశంలో మరో ఖగోళ అద్భుతం

గురువారం ఆకాశంలో మరో ఖగోళ అద్భుతం జరగబోతోంది. దాదాపు 3 గంటలపాటు సూర్యగ్రహణం ఏర్పడనుంది. కంకణాకార సూర్యగ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మనదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ సూర్య గ్రహణం ఉంటుంది. ఈ మూడు రాష్టాలు మినహాయించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్టాలన్నింటిలోనూ పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కనిపిస్తుంది.
హైదరాబాదులో ఉదయం 8 గంటల 8 నిముషాలకు సూర్యగ్రహణం మొదలై..11 గంటల 11 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో సూర్యుడు చుట్టూ ఓ అగ్ని వలయం కనిపిస్తుంది. గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే కళ్లు చెడిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకమైన కళ్లద్దాల ద్వారా మాత్రమే చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీమూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెరుస్తారు. ఆలయ శుద్ది అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సర్వ దర్శనం భక్తులను అనుమతిస్తారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. బెజవాడ కనకదుర్గ ఆలయం, అరసవల్లి సూర్యదేవాలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్, శ్రీశైలం సహా అన్ని ఆలయాలను మూసివేశారు.
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు అధికారులు.. సంప్రోక్షణ తర్నవాత గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి.. భక్తుల దర్శనాలను పునరుద్ధరిస్తారు.
శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది..ఇక్కడ నవగ్రహ కవచం ఉంది. దీంతో గ్రహణం ఏర్పడినా ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు. ఆ సమయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com