జగన్కి ఎందుకింత కక్ష : పవన్ కల్యాణ్

అమరావతిపై ముఖ్యమంత్రి జగన్కి ఎందుకింత కక్ష అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజధాని కోసం ధర్నా చేస్తున్న రైతులను పవన్ కలిశారు. వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. మొదట యర్రబాలెంలోని రాజధాని రైతులతో సమావేశమైన ఆయన.. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. వాడి డిమాండ్లను పవన్ అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా మహిళలు, రైతులు తమ ఆవేదనను పవన్కు మొరపెట్టుకున్నారు.
వైసీపీ సర్కార్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి విషయంలో ప్రభుత్వమే మాట తప్పిందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు సర్కార్ 33వేల ఎకరాలు సేకరించినప్పుడు భయమేసిందని.. కానీ ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేరని.. ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలు పడుతుందన్నారు. పిల్లల భవిష్యత్ను ఫణంగా పెట్టి రైతులు భూమిలిచ్చారని.. చంద్రబాబుపై, ఓ వ్యక్తిపై భరోసాతో రైతులు భూములివ్వలేదన్నారు. ప్రభుత్వంపై భరోసాతో రైతులు భూములిచ్చారన్నారు. ప్రభుత్వమే మాట తప్పడం దారుణమన్నారు పవన్.
అమరావతిలో అవకతవకలు జరిగితే దోషులను శిక్షించాలన్నారు. కొందరు వ్యక్తులపై ఉన్న కోపాన్ని.. ప్రజలందరిపై చూపించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీకి 151 సీట్లిచ్చింది... అస్థిరత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాదని వ్యాఖ్యానించారు. అమరావతికి వ్యతిరేకమని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com