పెరిగిన రైలు చార్జీలు.. కొత్త సంవత్సరంతోనే అమలు

కొత్త సంవత్సరం ప్రారంభ రోజు నుంచే రైలు చార్జీలను పెంచింది రైల్వేశాఖ. సబర్బన్ రైళ్లు తప్ప మిగిలిన అన్ని రకాల రైళ్లలో బుధవారం నుంచి చార్జీలు పెరగనున్నట్లు తెలిపింది. రోజూ సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని ఆ రైళ్లలో చార్జీలు పెంచట్లేదని వెల్లడించింది. సాధారణ నాన్ ఏసీ, నాన్ సబర్బన్ రైళ్లలో కిలోమీటరుకు ఒక పైసా, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటరుకు రెండు పైసలు, ఏసీ క్లాసులకు కిలోమీటరుకు నాలుగు పైసలు పెరిగాయి.
ప్రీమియం రైళ్లైన శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని చెప్పింది. అయితే ఇప్పటికే బుక్ చేసిన టికెట్ల రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ చార్జీ వంటి వాటికి ఈ పెంపు వర్తించదు. 2014లో చివరి సారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, సరుకు రవాణా ఛార్జీలు 6.5శాతం పెరిగాయి. ఛార్జీల పెంపుతో పాటు రైళ్లలో ప్రయాణికుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని.. దీంతో ఇప్పుడు చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని రైల్వే శాఖ పేర్కొంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com