కేబుల్ వినియోగదారులకు కొత్త సంవత్సరం కానుక.. రూ. 130 చెల్లిస్తే..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ... కేబుల్ వినియోగదారులకు కొత్త సంవత్సరం కానుక ప్రకటించింది. వినియోగదారులపై టారిఫ్ భారం భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. న్యూ టారిఫ్ ఆర్డర్కు సవరణలు చేసిన ట్రాయ్.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువరించింది. బేసిక్ ప్యాక్, అలాకార్ట్ లను రద్దు చేసిన అథారిటీ... ఇకపై 130 రూపాయలు చెల్లించిన వారికి 200 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో ఈ మొత్తానికి కేవలం 100 ఫ్రీ ఛానల్స్ మాత్రమే వచ్చేవి. వీటితో పాటు.. మరో 26 దూరదర్శన్ ఛానల్స్ను కూడా కేబుల్ ఆపరేటర్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే 200 కు పైన ఛానల్స్కు ఇకపై 160 రూపాయలు చెల్లిస్తే చాలు. అంటే 160 రూపాయలు చెల్లిస్తే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాల్సిందే అన్నమాట. ప్రస్తుతం 130 రూపాయలకు 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇచ్చాక అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రతి 25 అదనపు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కు 20 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనలన్నిటినీ టెలికం అథారిటీ రద్దు చేసింది. శ్లాబ్ సిస్టమ్ తో పాటు అలాకార్ట్ వెసులుబాటుకు కూడా ట్రాయ్ చెల్లుచీటి ఇచ్చింది. మార్చి 1, 2020 నుంచి న్యూ టారిఫ్ ఆర్డర్ సవరణలు అమల్లోకి రానున్నాయి.
బ్రాడ్కాస్టర్, కేబుల్ ఆపరేటర్ చెల్లింపుల విధానంలోనూ భారీ మార్పులు చేసింది ట్రాయ్. ఇకపై సెట్టాప్ బాక్స్కు నెలకు 20 పైసలు కడితే... ఆపరేటర్ ఆ ఛానల్ను తప్పనిసరిగా ప్రసారం చేయాల్సిందే. ఒకవేళ అప్పటికే ఆ ఛానల్ను 20 శాతం మందికి పైగా వినియోగదారులు సబ్స్క్రైబ్ చేస్తే.. డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ట్రాయ్ కొత్త టారిఫ్ సవరణలతో వినియోగదారులకు భారీ ఊరట కలిగింది. తక్కువ ఖర్చుతోనే ఇకపై అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ చూసే అవకాశం లభించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com