తనకేం తెలియదంటూ కోర్టులో వాదనలు వినిపించిన హాజీపూర్ సైకో కిల్లర్
హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి..అసలు తనకేం తెలియదంటూ కోర్టులో వాదనలు వినిపించాడు. పోలీసులు తనను బలవంతంగా ఎత్తుకొచ్చారని చెబుతున్నాడు. నల్లగొండలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం..హాజీపూర్ ఘటనలపై విచారణ జరిపింది. సీఆర్పీసీ 313 కింద నిందితుడు శ్రీనివాసరెడ్డి వాదనను కోర్టు నమోదు చేసుకుంది. డిసెంబర్ 26న మనిషా కేసులో నిందితుడి వాదన రికార్డ్ చేసుకున్న కోర్టు.. జనవరి 3న ఉదయం శ్రీవాణి, మధ్యాహ్నం కల్పన కేసులో శ్రీనివాస్ రెడ్డి తన వివరణ వినిపించాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ ఘటన కేసులో శ్రీనివాసరెడ్డి..స్కూలు విద్యార్ధులపై అఘాయిత్యాలకు తెగబడి హత్య చేసినట్లు అరోపణలు ఉన్నాయి. కల్పన, మనిషా, శ్రావణి అమ్మాయిలను హత్య చేసి సమీపంలోని పాడుబడిన బావిలో పాతిపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రావణి కేసులో ఇప్పటి వరకు 44 మంది సాక్షులు చెప్పిన వివరాలను, ఆలాగే కల్పన కేసులో 30 మంది చెప్పిన సాక్ష్యాలను శ్రీనివాసరెడ్డికి న్యాయమూర్తి చదవి వినిపించారు. అయితే..శ్రీనివాస రెడ్డి మాత్రం తనకే పాపం తెలియదంటూ కోర్టు ముందు రోటీన్ డైలాగ్ వినిపించాడు.
కల్పన కేసులో 30 సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాసరెడ్డి దాటవేత జవాబులే చెప్పాడు. అసలు కల్పన ఎవరో తనకు తెలియదని చెబుతున్నాడు. తాను పని చేస్తున్న దగ్గరికి పోలీసులు వచ్చి తనను బలవంతంగా అరెస్ట్ చేశారని ఆరోపించాడు. అయితే..ఏం పని చేశావు? ఎక్కడ చేశావు? మీ ఓనర్ ఎవరు అని జడ్జి ప్రశ్నించటంతో వివరాలు చెప్పలేకపోయాడు. తల్లిదండ్రులు, అన్నను పిలిపించాలని మరోసారి కోరాడు. అడ్రస్ ఉంటే పిలిపిస్తామన్న న్యాయమూర్తి 6వ తేదికు కేసు విచారణ వాయిదా వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com