మోదీతో.. మోహన్‌బాబు భేటీ.. పరస్పరం ప్రశంసల జల్లులు

మోదీతో.. మోహన్‌బాబు భేటీ.. పరస్పరం ప్రశంసల జల్లులు

modi,-mohan-babu

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మోహన్‌బాబు.. ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు మోదీతో మోహన్‌బాబు పలు అంశాలపై చర్చించారు. మోదీని కలిసిన వారిలో ఆయన కుమారుడు విష్ణు, కోడలు విరోనికా, కుమార్తె మంచు లక్ష్మి ఉన్నారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా మోహన్‌బాబు కుటుంబం భేటీ అయ్యింది.

ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాపై మోహన్ బాబు ప్రసంశల వర్షం కురిపించారు. దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి మోదీ అని, హోంమంత్రి పదవికే వన్నె తెచ్చిన నేత అమిత్ షా అని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ, షాలతో భేటీలో ఏం మాట్లాడుకున్నామో త్వరలోనే వెల్లడిస్తానని మోహన్ బాబు స్పష్టం చేశారు. బీజేపీలోకి మోదీ ఆహ్వానించారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం చెప్పలేనంటూ మోహన్ బాబు సమాధానం దాటవేశారు.

నటుల విషయంలో ఉత్తరాది, దక్షిణాది భేదాలు మోదీకి లేవన్నారు మంచు విష్ణు. త్వరలో దక్షిణాది నటులను మోదీ కలుస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. మరోవైపు మోదీతో దిగిన ఫోటోను మోహన్‌ బాబు ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ వాట్‌ ఏ మ్యాన్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రధాని మోదీని కలిశామని మంచు లక్ష్మి కూడా ట్వీట్‌ చేశారు. భారతదేశం మోదీ విజన్‌ను పూర్తిగా వినగలిగితే.. కచ్చితంగా మనం గొప్ప స్థానంలో ఉంటామని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

అటు.. మోహన్‌బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉంది. మన మధ్య చాలా విషయాలపై మంచి చర్చ జరిగింది. సినిమా ప్రాముఖ్యత, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎలా పెంచవచ్చు అనే అంశాలపై చర్చించాం. అంటూ మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు మోహన్‌బాబు కుటుంబంతో మోదీ కలిసిన ఫోటోను పోస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story