రాజధాని మార్పుతో.. రాయలసీమ నుంచి కొత్త డిమాండ్లు
ఆంధ్రప్రదేశ్లో రాజధాని రగడ కొనసాగుతోంది. తలలేని రాజధానితో ప్రజలు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఐదుకోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఒకవేళ రాజధాని మారిస్తే రాయలసీమను గ్రేటర్ రాయలసీమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దానికి చిన్న రాష్ట్రమనో.. కేంద్రపాలిత ప్రాంతమనో ఏ పేరు పెట్టినా సరేనన్నారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయాలను తీసుకుంటానని చెప్పారు.
ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని జేసీ కలిశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటానన్న జేసీ.. పీఓకేను ఆక్రమిస్తేనే బీజేపీలో చేరతానని అన్నారు.
అటు.. మూడు రాజధానులపై రాజ్యసభ సభ్యులు.. బీజేపీ నేత టీజీ వెంకటేష్ మరో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. మూడు ప్రాంతాల్లో సచివాలయం.. అసెంబ్లీ.. హైకోర్టులు పెడితే సమస్యే ఉండదని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ పెడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
మొత్తానికి.. అమరావతి తరలింపు అంశం అన్ని పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రాంతాలవారీగా నేతలు సరికొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com