అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చి.. అన్నంత పని చేసిన ఇరాన్
అమెరికా ఊహించనివిధంగా ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చి.. అన్నంత పని చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన రోజుల గ్యాప్లోనే.. ఇరాక్లోని ఆదేశ సైనిక స్థావరాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. సుమారు 80 మంది అమెరికా సైనికుల్ని మట్టుబెట్టామని.. ఇరాన్ స్టేట్ టెలివిజన్ ఓ ప్రకటన చేసింది. అమెరికా ప్రతీకార దాడులకు దిగితే... తమ దృష్టిలో మరో వంద లక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న ఇరాకీ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. అల్- అసద్, ఇర్బిల్లో ఉన్న వైమానిక స్థావరాలపై దాదాపు 15 బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో... ఇరాన్, ఇరాక్ గగనతలం మీదుగా తమ విమానాలు ప్రయాణించకుండా అమెరికా నిషేధం విధించింది. ఇరాన్ లేటెస్ట్ మిసైల్ ఎటాక్స్తో.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఇరాన్ డజనుకు పైగా క్షిపణులను ప్రయోగించింది. అమెరికా తక్షణమే తన బలగాలను వెనక్కు తీసుకోవాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాక్లో అమెరికా సైనికుల మృతిపై... పెంటగానే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నష్టం భారీగానే జరిగినట్లు పెంటగాన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా సైనికుల మృతిపై తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్షిస్తున్నారని వైట్హౌస్ అధికారులు వెల్లడించారు.
ఇరాన్ తాజాదాడులు, హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసముండే వైట్హౌస్లో హైఅలర్ట్ ప్రకటించారు. ట్రంప్ను చంపి తెస్తే 575 కోట్ల నజరానా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వైట్హౌస్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాన్ హెచ్చరికల దృష్ట్యా వైట్హౌస్ చుట్టుపక్కల భద్రతా బలగాలు మోహరించారు. వైట్హౌస్ సమీపంలోని చెక్ పాయింట్లలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు, సాయుధ భద్రతా బలగాలు పహరాను పటిష్ఠం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com