తిరుపతిలో హైడ్రామా మధ్య జేఏసీ ర్యాలీ.. చంద్రబాబు హాజరు

తిరుపతిలో హైడ్రామా మధ్య అమరావతి పరిరక్షణ జేఏసీ ర్యాలీ జరగబోతోంది. ఈ ర్యాలీలో.. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్నారు. నగరంలోని జ్యోతిరావ్పూలే విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు అమరావతి రాజధాని పరిరక్షణ ర్యాలీ జరుగుతుంది. మరోవైపు ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. అటు.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భారీ సంఖ్యలో మోహరించారు.
తిరుపతిలో ఉదయం నుంచి హైటెన్షన్ కొనసాగింది. పలువురు టీడీపీ నేతల్ని, జేఏసీ నాయకుల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారనగా.. వాళ్లను విడిచిపెట్టారు. తాము ఎలాంటి ముందస్తు అరెస్ట్ చేయలేదని ఎస్పీ కార్యాలయం ప్రకటించడం విశేషం. ఇదంతా కుట్ర పూరితంగా జరుగుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com