అమరావతిలో పోలీసుల ముసుగులో ప్రైవేట్ సైన్యం?
అమరావతి రాజధాని గ్రామాల్లోకి పోలీసుల ముసుగులో ప్రైవేట్ సైన్యం ప్రవేశించిందా? ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొంటున్న మహిళలు, యువకుల్ని టార్గెట్ చేస్తున్నారా? చురుగ్గా ఉంటున్నవారిని ఎంపిక చేసి మరీ అరెస్టులు చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజధాని మహిళలు. ముఖ్యంగా మందడంలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గ్రామంలోకి పదుల సంఖ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారని చెబుతున్నారు మహిళలు. దాదాపు 10 మంది మహిళలు, ఇద్దరు యువకుల్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆ ఇద్దరు యువకులపై పోలీసులు తీవ్రంగా దాడిచేశారన్న ఆరోపణలున్నాయి. గాయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వీరిని తీసుకెళ్లిన వాళ్లు సివిల్ డ్రెస్సుల్లో ఉండటం, ఎలాంటి బ్యాడ్జీలు లేకపోవడంపై.. ఐడెంటిఫికేషన్ నెంబర్, పేరు వివరాలు అడిగినా కూడా చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు మందడం మహిళలు. వాళ్లు ఎవరు అరెస్టు చేసిన వారిని ఎక్కడి, ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అమరావతిలో మహిళలపై జరుగుతున్న దమనకాండపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఇద్దరు సభ్యుల కమిటీని రాజధాని గ్రామాల్లోకి పంపుతున్నారు. వాళ్లు వచ్చి విచారణ ప్రారంభించేలోగా.. ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నవాళ్లందరినీ క్లియర్ చేయాలన్నది పోలీసుల టార్గెట్ అని మహిళలు ఆరోపిస్తున్నారు. అమరావతిలో పోలీసుల జులుం, మహిళలపై లాఠీఛార్జ్ వంటి అంశాలు బయటకు
తెలియకుండా ఉండేందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని మందడం మహిళలు చెబుతున్నారు.
మందడంలో శనివారం ఓ వ్యక్తి రహస్యంగా తన ఫోన్లో దృశ్యాలు చిత్రీకరించడం కూడా ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com