జోరుగా.. హుషారుగా.. కోడిపందాలు
ఉభయగోదావరి జిల్లా సంక్రాంతి పండుగ సందర్భంగా.. కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో రెండో రోజు కోడిపందాలు, గూండాటలు కొనసాగుతున్నాయి. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్.. చెయ్యేరులో కోడిపందాలు వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ఎదుర్లంక, కేశనకుర్రు, కొమరగిరి, పెదమడి, పాత ఇంజరం, రాజుపాలెం, చింతమెరక, రాణేలంక, కొత్త లంక, గెద్దెనాపల్లి ప్రాంతాల్లో పుంజుల యుద్ధాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. భారీగా షామియానాలు ఏర్పాటు చేసి.. స్టేడియంల తరహాలో ఏర్పాట్లు చేశారు. వీటిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు తరలివచ్చారు.
తుని నియోజవకర్గంలోనూ.. కోడి పందాలు జోరుగా నడుస్తున్నాయి. కోటనందూరు, తొండంగి మండలాల్లోనూ పందెరాయుళ్లు హుషారుగా పందాలు కాస్తున్నారు. అటు గుండాటలోనూ.. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ.. కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు. పందాలు కాసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పందెంరాయుళ్లు తరలివస్తున్నారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కోడి పందాలను ఎంజాయ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కాళ్లమండలం సిసలీలో డింకీ పందాలు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు తులాభారం చేశారు స్థానిక నేతలు. సంప్రదాయంగా వస్తున్న కోడి పందాలను.. జూద క్రీడగా చూడటం బాధాకరమన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com