బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమే

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఇవాళ లాంఛనం కానుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా నడ్డాను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఉదయం 10.30 గంటలకు ఈ ఎన్నిక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు కొత్త అధ్యక్షుడ్ని అమిత్ షా ప్రకటించనున్నారు. జేపీ నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ లేకుండానే నడ్డా ఎన్నిక జరిగే అవకాశముంది. నడ్డాకు మద్దతుగా నామినేషన్లను సమర్పించేందుకు కేంద్రమంత్రులు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల ప్రతినిధులు ఇవాళ ఢిల్లీ వస్తున్నారు.
విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన అనుభవం, కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన గుర్తింపు, ఆరెస్సెస్తో అనుబంధం, వివాద రహితుడిగా ఉండడం నడ్డాకు అనుకూలంగా మారాయి. దాంతో, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు.
ఐదున్నర ఏళ్లకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. షా హయాంలో బీజేపీ అత్యున్నత స్థాయికి వెళ్లింది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. తాజా ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రిగా చేరడంతో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం తప్పని సరైంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. త్వరగా పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకోవడం మంచిదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com