సాయి జన్మస్థలం వివాదంపై వెనక్కి తగ్గిన శివసేన సర్కార్

సాయి జన్మస్థలం వివాదంపై శివసేన సర్కార్ వెనక్కి తగ్గింది. ఇకపై బాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనేది లేదని తేల్చి చెప్పింది. కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని.. ఇక వివాదం సద్ధుమణిగినట్టేనని ఆ పార్టీ స్పష్ఠం చేసింది.
షిర్డీకి 273 కిలోమీటర్ల దూరంలోని పత్రి గ్రామాన్ని సాయి జన్మస్థలంగా చెప్పడం.. ఆ ప్రాంత అభివృద్ధికి ఇటీవల శివసేన సర్కార్ నిధులు కేటాయించడంతో వివాదం తలెత్తింది. ఉద్ధవ్ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ సహా పలు పార్టీలు తప్పుబట్టాయి. శివసేన ప్రభుత్వ నిర్ణయంపై షిర్డీ సంస్థాన్ ట్రస్ట్, షిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికి ప్రాధాన్యత కల్పిస్తే.. షిర్డీ ప్రాభవం తగ్గుతుందని స్థానికుల నుంచి పెద్దయెత్తన నిరసన వ్యక్తమైంది. కొద్దిరోజులుగా షిర్డీలో ఆందోళనలు మిన్నంటాయి.
షిర్డీ నగర ప్రజలు, స్థానిక నేతలు షిర్డీ నిరవధిక బంద్కు కూడా పిలుపునిచ్చారు. శివసేనకు చెందిన స్థానిక నేతలు కూడా బంద్కు మద్దతుగా నిలిచారు. మొదట తాము షిర్డీ భక్తులమని.. ఆ తర్వాతే చట్టసభలకు ఎన్నికయ్యామని.. వారిని శాంతింప చేసే ప్రయత్నాలు చేశారు. అయితే పత్రిని బాబా జన్మస్థలంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనంత వరకూ తాము వెనక్కి తగ్గేదిలేదని షిర్డీవాసుల స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సాయి జన్మస్థలం వివాదంపై శివసేన సర్కార్ వెనక్కి తగ్గింది. ఇకపై బాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనేది లేదని తేల్చి చెప్పింది. కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని.. ఇక వివాదం సద్ధుమణిగినట్టేనని.. ఆ పార్టీ నేత కమలాకర్ కోతే స్పష్టం చేశారు.
షిర్డీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం నాడు సమావేశమయ్యాయి. ఈ సమావేశం ముగిసిన తర్వాత శివసేన తన స్టాండ్ కు వెనక్కి తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com