విశాఖ శారదాపీఠంలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక పూజలు
విశాఖ శారదాపీఠంలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం అయ్యాక రెండోసారి ఆశ్రమానికి వచ్చిన ఆయన.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత గోమాతకు, జమ్మిచెట్టుకు పూజలు చేశారు. పీఠం వార్షికోత్సవంలో భాగంగా ఆగమ యాగశాలల్లో ఐదు రోజులుగా శ్రీనివాస చతుర్వేద హవనం, విశ్వశాంతి మహాయాగాలు జరుగుతున్నాయి.
వీటి ముగింపు సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు కూడా ఆశ్రమానికి తరలివచ్చారు. తెలంగాణ మంత్రి తలసాని సహా మరికొందరు ప్రముఖులు కూడా పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇవాళ ఆశ్రమానికి వెళ్లిన సీఎం జగన్కు.. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీర్వచనాలు అందించారు. మహా పూర్ణాహుతి ముగిసాక.. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపాన్ని ప్రారంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com