తెలంగాణలో ఊహించని విధంగా ఒకేసారి 50 మంది ఐఏఎస్ల బదిలీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయాన్ని ప్రజలు అందించడంతో ఇక పాలనపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.. రాత్రి పొద్దుపోయాక ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్ల బదిలీ జరగడం ఇదే తొలిసారి.. జిల్లా స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల్లో మార్పులు చేసి కొత్త జట్టును రూపకల్పన చేసుకున్నారు సీఎం కేసీఆర్.
21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించగా.. కీలకమైన శాఖల్లో అధికారులను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్కుమార్ను కీలకమైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.. ఇక గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న చిత్రా రామచంద్రన్కు విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధర్ సిన్హాను పశుసంవర్ధక శాఖకు ట్రాన్స్ఫర్ చేసింది.. మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జగదీశ్వర్ను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఇక పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ను ఆర్థిఖ శాఖ ముఖ్య కార్యదర్శులుగా నియమించింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డికి వ్యవసాయ శాఖ.. సీఎం కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు లభించాయి. వికాస్రాజ్ను మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే ఏడాదిన్నరగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 16 మంది సబ్ కలెక్టర్లకు పోస్టింగులు ఇచ్చారు. వాందరినీ ఐటీడీఏ పీవోలు, మున్సిపల్ కమిషనర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com