హస్తినలో అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి జేఏసీ నేతలు

అమరావతి రైతులు, జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఏపీ రాజధాని తరలింపుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి ఆయనకు వివరించారు. గత 52 రోజులుగా తాము అమరావతి కోసం ఆందోళన చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తిరిగి అక్రమ కేసులు పెడుతోందని వారు రాష్ట్రపతికి విన్నవించారు. రైతుల సమస్యలు సావధానంగా ఉన్న రాష్ట్రపతి.. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఉద్యమం చేస్తున్న రైతులు మృతి చెందడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేసినట్టు రైతులు చెబుతున్నారు.
రాష్ట్రపతితో సమావేశం తరువాత అమరావతి రైతులు కేంద్రమంత్రి నితిన్ గడ్కరినీ కలిశారు. ఏపీ రాజధాని రైతుల పోరాటాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చినట్టు రైతులు చెప్పారు. శుక్రవారం ప్రధానమంత్రి, హోంమంత్రి అపాయింట్మెంట్ లభించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిశామని.. రాష్ట్రంలో రాజధాని మార్పును వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు జేఏసీ నేతలు. ఇప్పటి వరకు తాము కలిసిన అందరి నేతల రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారన్నారు.
సేవ్ అమరావతి నినాదంతో ఢిల్లీ చేరిన రాజధాని రైతులు కేంద్రం పెద్దలకు వినతలు సమర్పిస్తున్నారు. వారం రోజులుగా ప్రతి రోజు కొందరి నేతలను కలిసి అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్నారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com