మేడారం జాతరలో కీలక ఘట్టం

మేడారం జాతరలో కీలక ఘట్టం

తెలంగాణ కుంభమేళా మేడారం భక్త జన సంద్రమైంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు, కోళ్లు, గొర్రెల బలులు, తలనీలాలు.. తల్లులకు ఎత్తు బెల్లం సమర్పణ. ఇలా ప్రతి అపురూప ఘట్టంతో.. వన జాతర భక్తులతో పోటెత్తుతోంది. అమ్మవార్ల భజనలు, శివనామస్మరణతో మేడారం మారుమోగుతోంది. శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఇక, ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి రాకతో మేడారం జాతర మరింత శోభాయమానంగా మారింది. వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు.

చిలకల గుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని మేడారానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్క స్వాగత కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య పాల్గొన్నారు. దారి పొడవునా సమ్మక్కకు లక్షలాది భక్తులు సమ్మక్క తల్లికి ఎదురేగి.. కోళ్లు, మేకలు బలి ఇస్తూ స్వాగతం పలికారు.

భక్తుల జయజయధ్వానాల మధ్య చిలకలగుట్టనుంచి మేడారం చేరుకున్న సమ్మక్క తల్లిని.. ప్రత్యేక పూజల మధ్య గద్దెపై ప్రతిష్టించారు పూజారులు. సమ్మక్క గద్దెపైకి చేరిన అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలిచ్చారు. దీంతో వనజాతర జనజాతరను తలపించింది. జాతర ప్రాంగణం మరింత శోభాయమానంగా కనువిందుచేసింది.

ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరారు. ఇప్పుడు సమక్క తల్లికి కూడా గద్దెపైకి చేరడంతో.. జాతర పూర్తి పరిపూర్ణతను సంతరించుకుంది. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. ఈ అద్భుత సన్నివేశాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు.

తల్లులిద్దరూ గద్దెలపైకి చేరడంతో.. ఇక శుక్రవారం ప్రధాన జాతర సాగనుంది. అంచనాలు మించి భక్తులు పోటెత్తే అవకాశం వుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం వనదేవతలను సందర్శించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక శనివారం రాత్రి గిరిజన దేవతలు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది.

Tags

Next Story