ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని వదులుకోం: అమరావతి రైతులు

అమరావతిలో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. 53వ రోజూ 29 గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ.. రాజధానిని మాత్రం వదులుకోమంటూ నినదిస్తున్నారు రైతులు. మందడం, తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల.. యువకులు 24 గంటల దీక్షలు చేపట్టారు. తుళ్లూరు దీక్షాశిబిరంలో ఓ మహిళా హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటీన విజయవాడకు తరలించారు. తుళ్లూరులో 53 రోజులుగా జరుగుతున్న దీక్షలో ఈ మహిళ పాల్గొంటున్నారు.
మందడంలోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు మహిళలు. మందడం నుంచి సచివాలయం వెళ్లే దారిలో కుర్చీలాట ఆడారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రాజధాని ప్రజలు తేల్చిచెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com