చనిపోయిన ఐటీ ఎంప్లాయిస్ పేరుతో లోన్లు.. మోసగాళ్ల అరెస్ట్..

లోన్ కావాలంటే చెప్పులు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే. బ్యాంక్ సిబ్బంది సాలరీ స్టేట్మెంట్, షూరిటీ ఇలా ఎన్నో అడుగుతారు. ఇవన్నీ ఇచ్చినా లోన్ ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ దీనికి భిన్నంగా మోసగాళ్లు మాత్రం ఏకంగా చనిపోయిన ఐటీ ఎంప్లాయిస్ పేరుతో లోన్లు తీసుకుంటున్నారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది.
రేపాకుల విష్ణుకుమార్ అనే యువకుడు గచ్చిబౌలిలోని యష్ టెక్నాలజీస్లో ఐటీ ఉద్యోగిగా పనిచేసేవాడు. అయితే గత సంవత్సరం సెప్టెంబర్లో బోటు ప్రమాదంలో చనిపోయాడు. చనిపోయిన రెండు నెలలకు అతడు లోన్ తీసుకున్నట్లు తన ఇంటికి కొరియర్లు, బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్టాలని లెటర్స్ వస్తున్నాయి. అలాగే అభిషేక్ ఆనంద్ అనే యువకుడు పెగా సాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. గత నవంబర్లో కారు ఢీకొని చనిపోయాడు. అతను చనిపోయిన నెలన్నరకు అతని అడ్రస్కి లోన్ తీసుకున్నట్లు లెటర్లు వచ్చాయి. తీరా లోన్స్ ఇచ్చిన బ్యాంకు సిబ్బంది వీరు చనిపోయారని తెలుసుకొని ఖంగుతిన్నారు. జనవరి 2న HDFC బ్యాంక్కు చెందిన అధికారులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చారు.
విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ భాగోతం అంతా బయటపెట్టారు. న్యూస్ పేపర్స్ ద్వారా చనిపోయిన ఐటీ ఉద్యోగులు వివరాలు తెలుసుకొని వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు మోసగాళ్లు. ఆ డాక్యుమెంట్స్ ద్వారా చనిపోయిన వారి సిమ్ కార్డులు తీసుకుని ఆన్లైన్లో లోన్స్ కోసం అప్లై చేసుకున్నారు. ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే వారి అకౌంట్ వివరాలతో ఆన్లైన్లో డబ్బులు డ్రా చేసుకున్నారు. గుంటూరుకు చెందిన ఆరుగురు సభ్యుల గ్యాంగ్ ఈ మోసాలకు పాల్పడింది. నలుగురి పేరుతో పలు బ్యాంకుల నుంచి 53 లక్షల 95వేల రూపాయల లోన్ తీసుకుంది ఈ గ్యాంగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

