CAA, NRCకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరతాం : ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
రాజ్యాంగ పరిరక్షణ కోసం సింహపురి గర్జించింది. పౌరసత్వ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సిఎఎకి వ్యతిరేకంగా భారీ బహిరంగస భలు, సదస్సులు, ర్యాలీలు జరిగాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నేతృత్వంలో బహిరంగసభ నిర్వహించారు. భారత రాజ్యంగ పరిరక్షణ పేరుతో నిర్వహించిన ఈ సభకు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం హాజరయ్యారు.. రాజ్యాంగం అనేది పవిత్ర గ్రంథమని.. దాన్ని ఉల్లంఘించిన వారెవరికైనా పతనం తప్పదని ప్రొఫెసర్ నాగేశ్వర్రావు హెచ్చరించారు.
ఇక CAA, NRCకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్ను కోరతామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష చేపట్టిన నెల్లూరు జేఏసీ నేతలకు మద్దతు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీ అమలు కాకుండా పోరాడతామన్నారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ ముఖ్యమంత్రుల్లాగా.. జగన్ కూడా బయటకు వచ్చి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాడాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని.. తగిన సమయంలో గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు టీడీపీ నేతలు.
కృష్ణా జిలా నందిగామలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఆజాద్బాగ్ సెంటర్లో చేపట్టిన దీక్షలు ఏడో రోజుకు చేరాయి. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ, ముస్లిం జెఎసి ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహిస్తున్నారు. అటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోనూ నిరసన దీక్షలు 59వ రోజుకు చేరాయి. ఢిల్లీలోని షాహీన్ బాగ్ మహిళల దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో 12 గంటలపాటు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com