నులి పురుగుల మాత్రలు వికటించి బాలిక మృతి

నులి పురుగుల మాత్రలు వికటించి బాలిక మృతి

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నులి పురుగుల మాత్రలు వికటించి 8 ఏళ్ల బాలిక మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వివిధ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన మరో 10 మంది విద్యార్ధిని, విధ్యార్ధులు అస్వస్థతకు గురినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో ప్రభుత్వ సిబ్బంది ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. హరిజన కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో తిప్పర్తి సహస్త్ర అనే 8ఏళ్ల చిన్నారికి నులి పురుగుల మాత్రలు వేయించారు తల్లిదండ్రులు. మాత్రలు వేసిన కొద్దిసేపటికే బాలిక సృహతప్పి పడిపోయింది. వెంటనే బాలికను ధర్మపురి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు అక్కడి నుంచి జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నులి పురుగుల మాత్రలు వికటించే తమ కూతూరు మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా మరో 10మంది విద్యార్ధులు నులి పురుగుల మాత్రలు వికటించి అస్వస్తతకు గురైయ్యారు. వెంటనే వారిని ధర్మపురి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఓ విద్యార్ధి ప్రాణం కోల్పోగా.. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story