కర్నూలులో రెండోరోజు పర్యటిస్తున్న పవన్

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన పవన్... ఇవాళ నగరంలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నగర శివారులోని జోహరాపురం వంతెనను సందర్శించి, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బి.తాండ్రపాడు సమీపంలో అసంపూర్తిగా ఉన్న జీ ప్లస్ 2 గృహాలను పరిశీలించి నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులతో చర్చిస్తారు.
అనంతరం.. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడి నిర్వహించే కార్యక్రమాలకు పవన్ హాజరవుతారు. ఆగిపోయిన టెక్స్టైల్ పార్క్ను, ఆక్రమణలకు గురైన స్థలాన్ని పరిశీలిస్తారు. అలాగే, వీవర్స్ కాలనీలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రంతో పవన్ కర్నూలు జిల్లా పర్యటన ముగుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com