ఏ ముఖం పెట్టుకుని ఎన్డీఏలో వైసీపీ చేరుతుంది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

కేంద్రంలోని NDAలో చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుని ఓట్లు వేయించుకున్న వైసీపీ.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎన్డీఏలో చేరుతుందని సూటిగా ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అజెండాను అమలుచేస్తున్న బీజేపీతో జట్టు కట్టడం అంటే.. దళితులు, మైనార్టీలను మోసం చేయడమే అన్నారు సీపీఐ రామకృష్ణ. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, అంజాద్భాషా ఖండించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీ నేతలు ఉబలాడపడుతున్నారని సీపీఐ రామకృష్ణ ఎద్దేవా చేశారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ మద్దతిచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇదే వైఖరి కొనసాగితే.. ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com