కొత్త జీవో విడుదలపై మరింత అసహనం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

కొత్త జీవో విడుదలపై మరింత అసహనం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

రాజధాని రైతుల ఆందోళనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 70 రోజులుగా ధర్నాలు , దీక్షలు చేస్తున్నా స్పందించని సర్కారు.. అమరావతి భూముల్లో పేదలకు పట్టాలించేందుకు రంగం సిద్ధం చేసింది. మొత్తం 54 వేల 307 మందికి ...12 వందల 51.5 ఎకరాలు పంపిణీ చేయబోతున్నారు. ఇందుకోసం నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను గుర్తించారు. రాజధాని పరిధిలోని నవులూరులో 215 ఎకరాలు, మందడంలో 169.3 ఎకరాలు, నిడమర్రులో 583 ఎకరాలు, కురగల్లులో 38.3 ఎకరాలు, ఐనవోలులో 53.1 ఎకరాలు, కృష్ణాయపాలెంలో 193.27 ఎకరాలు ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ జీవో జారీ చేశారు.

'నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా ఈ భూపంపిణీకి నిర్ణయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. పేదలకు ఇళ్ల కేటాయింపు కోసం రాజధాని ప్రాంతంలో కొంత భూమి ఇవ్వాలని కృష్ణా, గుంటూరు కలెక్టర్లు CRDA అధికారులను కోరారు. ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూమిలో 5 శాతం పేదల ఇళ్ల పట్టాల కోసం కేటాయించేందుకు CRDA చట్టం అనుమతిస్తున్నందున సమ్మతి తెలిపారు.

గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లోని పేదలకు, అలాగే కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ నగరంలో ఉన్న అర్హులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. తాడేపల్లిలో 11వేల 300 మంది, పెదకాకానిలో 1,308 మంది, మంగళగిరిలో 10వేల 247 మందికి, దుగ్గిరాలలో 2,500 మందికి ఇళ్ల పట్టాలిస్తారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన 28 వేల 952 మందికి స్థలాలు ఇస్తారు. మొత్తంగా 54 వేల 307 మందిని లబ్దిదారులుగా చెప్తూ ఈ జీవో వచ్చింది. ఒక్కొక్కరికి సెంటు చొప్పున కేటాయిస్తారు. వాటిని అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యత CRDA చూస్తుంది. రెవెన్యు శాఖ నుంచి ఇందుకు నిధులు కేటాయిస్తారు. మహిళల పేరుపైనే ఈ ఇళ్ల పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేపిటల్‌ను విశాఖకు తరలిస్తూ తామిచ్చిన భూములు ఇళ్ల పట్టాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. మందడంలోని జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. తాము పేదల ఇళ్ల పట్టాలకు వ్యతిరేకం కాదని.. ప్రభుత్వం కావాలనే ఈ విషయంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల అమరావతిలో భూముల సర్వే కోసం వచ్చినరెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో 426 మంది రైతులపై కేసులు కూడా పెట్టారు. ఇప్పటికే ఈ పరిణామాలతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న రైతులు.. ఇప్పుడు పేదల ఇళ్ల పట్టాలపై జీవో రావడంపై మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story