సలీం సమస్య పరిష్కరించి.. సలాం అనిపించుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. సాధారణంగా సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు రోడ్డుపై చాలామంది ఉంటారు కానీ.. ఎవరూ వారిని చూసి పట్టించుకోరు. రయ్ రయ్ మంటూ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం.. తనలో మానవత్వం ఉందని నిరూపించుకున్నారు. ఆ వికాలంగుడి బాధ తెలుసుకుకోవాలని.. వెంటనే కారు దిగి వృద్ధుడి దగ్గరకు వెళ్లారు. సమస్యేంటో అడిగి తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ కిందకు దిగి తన కోసం రావడంతో.. ఆ వృద్ధుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే తనను మహ్మద్ సలీమ్గా పరిచయం చేసుకుని.. తన పరిస్థితిని, కుటుంబం పడుతున్న కష్టాలను సీఎంకు వివరించాడు. నాలుగేళ్ల కిందట బిల్డింగ్పై నుంచి పడడంతో కాలు విరిగిందని.. తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని.. ఉండడడానికి ఇల్లు కూడా లేదని తగిన సహాయం చేయాలని కోరాడు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో టోలీచౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లారు కలెక్టర్ శ్వేతా మహంతి. వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సలీమ్ వికలాంగుడని ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. అలాగే జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. సలీమ్ కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.
నిత్యం బిజీబిజీగా ఉన్న సీఎం ఇలా తన పనులు.. భద్రత, ప్రోటోకాల్ అన్ని పక్కన పెట్టి ఓ సామాన్య వృద్ధుడి కోసం.. కాన్వాయ్ దిగి రావడం.. ఏదో నాలుగు మాటలు చెప్పి ఓదార్పునివ్వడమే కాకుండా.. మై హూనా అంటూ భరోసా ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. స్వయనా సీఎం ఆదేశాలతో ఆ వృద్ధిడి కష్టాలు కొన్ని గంటల్లో తీరడానికి మార్గం దొరికింది. సీఎం ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద ఆయన ఇంటికి వెళ్లారు.. పెన్షన్ ఇచ్చి, జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com