హైకోర్టు తీర్పుతో.. తర్జన భర్జన పడుతున్న ఏపీ ప్రభుత్వం

హైకోర్టు తీర్పుతో.. తర్జన భర్జన పడుతున్న ఏపీ ప్రభుత్వం

స్థానిక సంస్థల రిజర్వేషన్‌పై.. ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. ఈ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. నెలలోపు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో.. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలు రావడంతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు జిల్లా స్థాయిల్లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని హైకోర్టు ఆదేశించడంతో దానికి తగ్గట్టు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

మరోవైపు.... మార్చి నెలాఖరు నాటికి 14వ ఆర్థిక సంఘం గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను పూర్తి చేయకపోతే గ్రామపంచాయతీలకు రావాల్సిన 3 వేల 400 కోట్లకుపైగా నిధులు.. అలాగే పురపాలక సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే నెలాఖరుకల్లా ఎన్నికలు పూర్తి చేసే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఆగిపోతే మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఆఘమేఘాలపై హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు.

Tags

Read MoreRead Less
Next Story