రాజధాని రైతుల నిరసనలకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు

అమరావతి ఉద్యమం 81వ రోజు మరింత ఉధృతం అయ్యింది. రోజుకో రూపంలో ఆందోళనలు చేపడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. అయినా రైతులు వెనకడుగు వేయడం లేదు. 29 గ్రామాల్లోనూ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు.. మందడం, తుళ్లూరులో నేడు మహాధర్నాలు కొనసాగించనున్నారు. వెలగపూడిలో 81వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులోని శిబిరాల్లో రైతులు ధర్నాలు చేపట్టారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ ఆందోళలనలు కొనసాగతున్నాయి.
రాజధాని రైతుల నిరసనలకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రతిరోజూ 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నేతలు, సామాన్యులు అమరావతికి మద్దతు తెలుపుతున్నారు. ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యని భరోసా ఇస్తున్నారు. అమరావతిని కాపాడుకునేందుకు తాము ప్రాణాలైనా అర్పిస్తాం కాని.. ఉద్యమాన్ని ఆపం అంటూ ప్రభుత్వాన్ని రాజధాని రైతులు హెచ్చరిస్తున్నారు.. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com