కేబినెట్ సమావేశం.. బడ్జెట్ ను ఆమోదించనున్న మంత్రివర్గం

కేబినెట్ సమావేశం.. బడ్జెట్ ను ఆమోదించనున్న మంత్రివర్గం

12 రోజుల పాటు జరగనున్నతెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున గవర్నర్ తమిళిసై తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలవడం గర్వకారణమని ఆమె అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పెన్షన్, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, పేదలకు ఉపాధి కల్పన, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు లాంటి పథకాలు దేశానికే ఆదర్శనీయమని కొనియాడారు. ఆర్థికమాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం క్రమశిక్షణ పాటించిందని చెప్పారు.

సభ వాయిదా అనంతరం సమావేశమైన బీఏసీలో 12 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 8వ తేదీన ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 20 వరకు జరగనున్న సమావేశాల్లో 9,10,15 తేదీల్లో సెలవులుంటాయని బీఏసీ తెలిపింది. ఈ నెల 20న ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలపనున్నాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించాల్సివస్తే ఈనెల 20న బీఏసీ మరోసారి సమావేశం అవుతుంది. ఎన్ని రోజులు పొడిగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. శనివారం సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. మండలి సమావేశాలు 8 రోజుల పాటు జరుగనున్నాయి.

శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. చర్చ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తారు. అనంతరం శనివారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. దాదాపు లక్షా 60 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోద ముద్ర వేయడంతోపాటు.. కేంద్రం తీసుకొచ్చిన CAA, NPR , ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారు. ఇక బడ్జెట్‌ కోసం మధ్యతరగతి ప్రజలు, రైతులు, ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా ఏమైనా వరాలు కురిపిస్తారా.. లేక మాంధ్యం ప్రభావంతో ఆచితూచి అడుగులు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Tags

Next Story