83వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

83వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 83 వ రోజుకు చేరింది. గత 82 రోజులుగా ఉద్యమం మహోగ్రంగా సాగుతోంది. సేవ్‌ అమరావతి నినాదం మారుమోగుతోంది. రోజులు మారుతున్నా రాజధాని రైతులు, మహిళల పోరాటం కొనసాగుతూనే ఉంది. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి దూరంగా ఉన్నారు రాజధాని మహిళలు. రాజధాని తరలింపును ఆపే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. తమ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు..

వెలగపూడిలో మహిళలు 24 గంటల దీక్ష కొనసాగించారు. 151 మంది మహిళలు 12 గంటల దీక్ష చేశారు. మందడం, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, నవులూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, నిడమర్రులో నిరసన దీక్షలు కొనసాగించారు. మదర్ థెరీసా, రాణి రుద్రమ, ఝాన్సీలక్ష్మీబాయి, మలాలా.. వేష ధారణలో మహిళలు నిరసన తెలిపారు. నల్లబెలూన్లు ఎగురవేసి, రాట్నాలతో నూలు వడుకుతూ.. సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు..

మందడం, తుళ్లూరుల్లో రాజధాని రైతులు మహాధర్నాలు కొనసాగించారు. వెలగపూడిలో రిలే దీక్షలు చేపట్టారు. 29 గ్రామాల్లోనూ ఎండయినా, వానయినా రాజధాని రైతుల ఆందోళనలు ఆగడం లేదు. ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టడం ఆపాలని రాజధాని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఓవైపు రాజధారి రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలపై వెనక్కి తగ్గని ప్రభుత్వం మందడం, ఐనవోలులో భూముల్ని అధికారులతో చదును చేయిస్తోంది. రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా భారీ బందోబస్తు మధ్య దాదాపు 70 ఎకరాల భూమిని చదును చేయించారు.. మరోవైపు... రాజధాని రైతులకు వివిధ ప్రాంతాల నుంచి మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన అనేకమంది రైతులకు సంఘీభావం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story