రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్న వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్న వైసీపీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను చేజిక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. నర్సరావుపేట ఆర్డీవో ఆఫీస్‌ వద్ద వీరంగం సృష్టించారు. టీడీపీ నర్సరావుపేట ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‌తోపాటు అతని అనుచరులపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు.. పోలీసులు అక్కడే ఉన్నా చోద్యం చూశారు..

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ దౌర్జన్య కాండ కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీభత్సం సృష్టిస్తున్నారు.. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కొని దాడులకు పాల్పడ్డారు. తిరుపతి రూరల్‌ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను చింపిన వైసీపీ నేతలు.. వారిని బలవంతంగా వెనక్కి పంపించేశారు..

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. తాళ్లవాయపాడు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నరసయ్య నామినేషన్ పత్రాలు చింపేశారు. మరోసారి కారులో వెళ్లి నామినేషన్‌ వేయాలని ప్రయత్నించినా... వీలుకాలేదు. కారు అద్దాలను ధ్వంసం చేశారు వైసీపీ నేతలు. దీంతో పెళ్లకూరు పీఎస్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు మాజీ మంత్రి వెంకటరత్నం..

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం పంచాయతీలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి.మణెమ్మ, మణికంఠ అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మండిపడ్డ ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ.. స్థానిక సంస్థలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని నిలదీశారు..

గుంటూరు, నరసరావు పేటలో నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న జనసేన నేతలపై దాడి చేశారు వైసీపీ నేతలు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో టీడీపీ అభ్యర్థుల తరపున నామినేషన్‌కు హాజరైన మాజీ ఎమ్మెల్యే అనితను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వలేదు..

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలో పోలీసుల సహకారంతో రెచ్చిపోయారు వైసీపీ నేతలు.. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బలవంతంగా బయటకు లాక్కెల్లారు. యాకిడి మండలంలో టీడీపీ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు. అటు కర్నూల్‌ జిల్లా మంత్రాలయం మండలం కోసిగిలో... నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డిలకు పోలీసులు అనుమతి నిరాకరించారు..

కడపజిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అభ్యర్ధి పద్మావతి నామినేషన్‌ పేపర్లను చింపేశారు వైసీపీ నేతలు. ఏకంగా ఆర్వో రూంలోన ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మొత్తానికి నామినేషన్‌కు చివరి రోజు కావడంతో... టీడీపీ, బీజేపీ, జనసేన నేతల నామినేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.

Tags

Read MoreRead Less
Next Story