అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం: అమరావతి రైతులు

రాజధాని కోసం 29 గ్రామాలు రణ నినాదం చేస్తున్నాయి. ప్రభుత్వం కేసులతో భయపెడుతున్నా ఏమాత్రం లెక్క చేయడం లేదు.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉద్యమమే ఊపిరిగా రాజధాని ప్రాంత ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.. చిన్నా, పెద్దా తేడా లేదు.. ముసలీ ముతకా అంతా వచ్చి దీక్షల్లో కూర్చొని రాజధాని తరలించొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అమరావతిలోని ఏ గ్రామంలో చూసినా జై అమరావతి నినాదాలే వినిపిస్తున్నాయి.. మహిళలు సైతం ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మొక్కవోని దీక్ష చేస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. తమ పక్షానే న్యాయం, ధర్మం ఉందని.. ఎప్పటికైనా తమ పోరాటం గెలుస్తుందన్న నమ్మకంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, పెనుమాక, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రైతులు. మూడు నెలలుగా నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని కాపాడుకోవడం కోసం ఎందాకైనా వెళ్తామంటున్నారు రైతులు. రాష్ట్ర అభివృద్ధి, 5 కోట్ల మంది ప్రజల కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేస్తే.. పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదంటున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com