జగన్ అంతర్జాతీయ స్థాయిలో నవ్వుల పాలు అయ్యారు : చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రపంచాన్ని కరోనా సునామీలా తరుముతుంటే.. ఏమాత్రం పట్టనట్టు జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్తో కరోనా తగ్గిపోతుందని అనడంపై అవగాహనారహిత్యమన్నారు. జగన్ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో నవ్వుల పాలవుతున్నాయన్నారు..
కరోనా విషయంలో జగన్ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా క్వారంటైన్ పెట్టారా? అని ప్రశ్నించారు. దేశంలో కరోనా ప్రస్తుతం 2వ స్టేజ్లో ఉందని, మూడోస్టేజ్కు వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. కరోనా వైరస్పై ఏపీ సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు స్వాగతించారు. ఈ తీర్పును సైతం వైసీపీ నేతలు వక్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడానికి బుద్ధి, జ్ఞానం ఉందా?. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారా? అని ప్రశ్నించారు..
మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషనర్ను తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల కమిషన్ను ఇష్టం వచ్చినట్టు తిడతారా అని మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రులు బూతులు మాట్లాడడం మానివేయాలని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com