అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్లో ఎంట్రీ ఇచ్చిన 'కరోనా'
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశాలన్నీ బాయోవార్ లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. దాదాపుగా అన్ని దేశాలకు వ్యాపించింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు నిర్బంధంలోకి వెళ్లాయి. అమెరికాలో ఇప్పటివరకు 260 మంది చనిపోయారు. కరోనా సోకిన వారి సంఖ్య 20 వేలకు చేరుకుంది.
ఇలా రోజురోజుకూ భయానకంగా మారుతున్న తరుణంలో అమెరికాకు మరో పిడుగులాంటి వార్త వచ్చింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో కరోనా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వద్ద పనిచేసే బృందంలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో వైట్హౌజ్ అప్రమత్తమైంది. శ్వేతసౌధంలో పనిచేస్తున్న వారిలో వైరస్ సోకిన తొలి ఉద్యోగిగా అతన్ని గుర్తించారు. అయితే వైరస్ సోకిన ఉద్యోగితో అధ్యక్షుడు ట్రంప్ కానీ, ఉపాధ్యక్షుడు పెన్స్ కానీ కాంటాక్ట్లోకి రాలేదని వైట్హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కేటీ మిల్లర్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com