ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థి

ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థి

కరోనా మరణ మృదంగం మోగిస్తున్న ఇటలీలో ఓ తెలుగు విద్యార్థి చిక్కుకుపోయాడు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధి ప్రగతి నగర్ లో నివాసం ఉండే సజ్జా మురళీ కృష్ణ తన కుమారుడు అన్షుమన్ ను.. ఇంజినీరింగ్ విద్య కోసం ఇటలీ పంపారు. ప్రస్తుతం అన్షుమన్ ఇటలీలోని లాజియో డిస్ట్రిక్ట్ కు చెందిన రీతిలో నివాసం ఉంటూ అక్కడి ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అంతా బాగుంటుందనుంటున్న సమయంలో కరోనా మహమ్మారి ఇటలీని కమ్మేసింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులను చూసిన అన్షుమన్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అక్కడి మన భారత రాయబార కార్యాలయానికి తన వివరాలను తెలుపుతూ... తనను కరోనా బారి నుంచి కాపాడాలని, తనను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని సమాచారం పంపాడు.

ఇదిలావుంటే, తన కుమారుడి పరిస్థితి తెలుసుకుని హైదరాబాద్ లో ఉంటున్న మురళీ కృష్ణ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. తన కుమారుడిని కరోనా బారి నుంచి రక్షించి తమ వద్దకు చేర్చాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఆ కుటుంబం సందేశాలు పంపిందట. అయితే ఇప్పటిదాకా ఏ ఒక్కరి నుంచి కూడా స్పందన రాకపోవడంతో ఏ క్షణంలో తన కుమారుడికి ఏం జరుగుతుందోనని మురళీ కృష్ణ కుటుంబం క్షణక్షణం భయంభయంగా గడుపుతోంది.

Tags

Next Story