తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు
![తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/03/ap-corona-1.png)
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు 39కి చేరాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో విదేశాల నుంచి వచ్చిన ముగ్గురితో పాటు లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురు వైరస్ బారినపడినట్లు తెలిపింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. లోకల్ కాంటాక్ట్ ద్వారా మంగళవారం కరోనా వైరస్ బారిన పడిన వారిలో కొత్తగూడెం చెందిన 57 ఏళ్ల డీఎస్పీ, ఆయన ఇంట్లోని 33 ఏళ్ల వంట ఆవిడకు కూడా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన ఆ అధికారి కుమారుడు ఇప్పటికే వైరస్ బారిన పడ్డాడు.
రాష్ట్రంలో 25వ పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తి ద్వారా ఓ మహిళకు కూడా లోకల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఆమె ఎవరెవరిని కలిసింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ద్వారా వారి కుమారుడికి, 10 మంది పాజిటివ్ వచ్చిన ఇండోనేసియా బృందంతో కలిసి తిరిగిన కరీంనగర్వాసికి లోకల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకింది. రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో స్టేజికి చేరుకోవడం, ఇదే తీవ్రత కొనసాగితే మూడో స్టేజీకి కూడా వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com