సౌదీ రాజకుటుంబంలోకీ కరోనా.. 150 మంది కుటుంబసభ్యులకు..
నాకెవ్వరూ ఎక్కువా కాదు.. తక్కువా కాదు.. అందరూ సమానమే అంటూ పేద, ధనిక తారతమ్యాలను చెరిపేస్తూ అందర్నీ పట్టిపీడిస్తోంది కరోనా వైరస్. తాజాగా సౌదీ రాజకుటుంబానికి చెందిన 150 మంది కుటుంబసభ్యులకు ఈ వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. రియాద్ గవర్నర్గా ఉన్నసీనియర్ యువరాజు ఐసీయూలో ఉన్నారని, రాజకుటుంబంలోని మరికొంతమందికి చికిత్స జరుగుతోందని సమాచారం.
ఇందులో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని పలు అంతర్జాతీయ వార్తా సంస్థల సమాచారం. ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాకుండా ఉంచినా, రాజ కుటుంబీకులకు వైద్యం అందించే డాక్టర్ కింగ్ ఫైసల్ ఆసుపత్రిలో 500 పడకలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులను కోరారు. దాంతో రాజకుటుంబీకులకు వైరస్ సోకిన విషయం వెలుగులోకి వచ్చింది.
కాగా, సౌదీ అరేబియాలో 33 మిలియన్ల మంది ప్రజలు ఉంటే ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన కేసులు 2,932 గా నమోదు కాగా అందులో 41 మరణాలు ఉన్నాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ రాకపోకలను పరిమితం చేశారు. ఐదు ప్రధాన నగరాల్లో లాక్డౌన్ విధించారు. వైరస్ బారిన పడిన కేసులు చాలా వరకు మక్కా మరియు మదీనా చుట్టు ప్రక్కల ఉన్న వలస కార్మిక శిబిరాల్లో నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి విస్తృతమవుతుందని సౌదీ ఆరోగ్య మంత్రి మంగళవారం దేశ ప్రజలను హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com