ఉద్యోగానికే ఎసరు పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్

ఉద్యోగానికే ఎసరు పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్

సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, అసత్య ప్రచారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు పదే పదే చెబుతున్నా.. కొందరు అతివాదులు అదే పొరపాటు చేసి పీకల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇస్లాంకు వ్యతిరేకంగా భారత్ లోని మైనారిటీ వర్గాన్ని కించపరుస్తూ పెట్టిన పోస్టు అతని ఉద్యోగానికే ఎసరు పెట్టింది.

హైదరాబాద్ కు చెందిన నక్కా బాలకృష్ట దుబాయ్ లోని మోరో హబ్ డేటా సొల్యూషన్స్ లో చీఫ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అయితే..భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తికి ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కారణమంటూ కొద్ది రోజులుగా ఇండియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా మైనారిటీలపై విద్వేషపూర్వక పోస్టింగులను షేర్ చేస్తున్నారు. గల్ఫ్ లో కూడా కొందరు వ్యక్తులు ఇస్లాం విద్వేష పోస్టులను పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదీ నక్కా బాలకృష్ట తన ఫేస్ బుక్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ముస్లింలను కరోనా వైరస్ రూపంలో ఉన్న మానవ బాంబులుగా చిత్రీకరించేలా తన పోస్టింగులు ఉన్నాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుబాయ్ లో స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయం కాస్త కంపెనీ దృష్టికి వెళ్లటంతో మోరో హబ్ డేటా సొల్యూషన్స్ అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించింది. విద్వేషాలను రెచ్చగొట్టే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించింది. అలాగే కంపెనీ బ్రాండ్ వాల్యూని దెబ్బతీసేలా ప్రవర్తించే వారి విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story