ఇంతటి వినాశనానికి వారే కారణం.. అందుకే నిధులు బంద్: ట్రంప్
చైనా వల్లే ప్రపంచం కరోనా బారిన పడి కకావికలమవుతోంది. ఈ విషయం తెలిసి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చైనానే సపోర్ట్ చేస్తోంది. మరి అలాంటప్పుడు మేమెందుకు పెద్ద మొత్తంలో ఆ సంస్థకు నిధులు మంజూరు చేయాలని అగ్రరాజ్య అధినేత ట్రంప్ డబ్ల్యుహెచ్ఓని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం చైనాలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 1.9 మిలియన్ల మంది సోకింది అందులో మంగళ వారం నాటికి 1,25,678 మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిధ్యాలయం విడుదల చేసిన గణాంకాలు. అయితే ఐక్యరాజ్య సమితి ప్రతినిధి గుటెర్రస్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ వైరస్కి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ఇతర మానవతా సంస్థల కార్యకలాపాల కోసం వనరులను తగ్గించే సమయం ఇది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 18న చైనాలో కొత్త కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళించబోతోందని డబ్ల్యుహెచ్వో హెచ్చరింది. దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా వైరస్ నియంత్రణలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని జనవరి 30న డబ్ల్యుహెచ్వోకు వివరించారు. మళ్లీ మార్చి 11న డబ్ల్యుహెచ్వో కరోనాను ఒక మహమ్మారిగా ప్రకటించారు. కరోనా వైరస్ని రాజకీయం చేయొద్దంటూ వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోమంటూ డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ ఏప్రిల్ 8న అన్నారు.
కరోనా సంక్షోభాన్ని నివారించడంలో డబ్ల్యుహెచ్వో పూర్తిగా విఫలమైందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు 3,833 కోట్ల నిధులు సంస్థకు సమకూరుస్తున్నాము. అదే చైనా అయితే రూ.300 కోట్లు మాత్రమే అందిస్తుందని అన్నారు. అయితే అమెరికా అభిప్రాయాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. నిధులు సమకూర్చకపోవడమంటే డబ్ల్యుహెచ్వోను బలహీనపరచడమే అని అంటోంది. మైక్రోసాప్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సైతం ట్రంప్ అభిప్రాయాన్ని తప్పుపడుతున్నారు. ఈ చర్య అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్నారు. జర్మనీ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com